నన్ను, నా వ్యక్తిత్వాన్ని తీర్చి దిద్దుకోవడం లో భారతీయ ధర్మం, ఆధ్యాత్మికత నాకు ఎలా దారి చూపిస్తాయో ఆలోచనలో పడ్డాను. అప్పటి వరకు మనసులో సన్నగా మొలకెత్తి ఉన్న కోరిక బలం గా నాటుకు పోయింది. నేను ఎక్కడికి వెళ్ళినా, ఎవరిని కలిసినా అక్కడికి దగ్గర లో ఉన్న క్షేత్రాన్ని దర్శించి, ఆ క్షేత్రం యొక్క విశిష్టత ని - తత్వాన్ని తెలుసుకుంటూ నా ఆధ్యాత్మిక చైతన్యాన్ని కొనసాగించాలి అని నిర్ణయించుకున్నాను. ఈ రోజు మనుషులు పొందుతున్న అనేక రుగ్మతలకి, మానసిక జాడ్యానికి సరి అయిన జవాబు భారతీయ ఆధ్యాత్మికత అని నా ప్రగాఢ విశ్వాసం.
ఆస్ట్రియా నుంచి ఆఫ్ఘాన్, పాకిస్తాన్ మీదుగా ఇండియా వస్తున్నప్పుడు - విమానం లో చిన్న స్క్రీన్ మీద కనిపిస్తున్న ప్రయాణ మార్గాన్ని నాకు కిటికీ నుంచి కింద కనిపిస్తున్న భూమి తో పోల్చి చూస్తూ ఉన్నాను. పాకిస్తాన్ దాటుతూ ఉండగా చీకటి లో లోయల లాంటి ప్రాంతం కనిపించింది. బాగా నిర్మానుష్యం గా ఉన్న ఆ ప్రదేశం లో ఒక చోట లోయ అంచులలో కొన్ని దీపాలువెలుగుతూ కనిపించాయి. ఆ ప్రదేశం మన పురాణాలలో వివరించిన హింగులా శక్తి క్షేత్రం ఏమో అని అనిపించింది. నిలువెల్లా ఒక పులకరింత కమ్మేసింది. ఎన్నో విశిష్టత లు, విశేషాలు, అందాలు, ఆనందాలు, ప్రకృతి విచిత్రాలు కలగలిసి వెలుగుతున్న ఈ సృష్టిలో - మెదడు తో ఆలోచించ గలిగి మనసు తో అనుభూతి చెందగలిగే మనిషి గా పుట్టి, సకల రోగాలని కల్మషాన్ని రుగ్మత లని పోగొట్టే శక్తి ఉన్న ఆధ్యాత్మిక సంపద పుష్కలం గా ఉన్న భారత దేశం లో నేను ఒక వారసుడి ని అయినందుకు గొప్ప గా అనుభూతి చెందాను - ఆ క్షణం లో.
నాలో ఈ భావ పరంపర ఇలా సాగుతోంది అప్పటి నుంచి - ఒక ప్రవాహం లా.
కొన్ని సంఘటనలు మనం ఊహించనంత వేగం గా జీవితం లో జరుగుతాయి. ఏమి జరుగుతుందో గ్రహించే లోపు మనసు తో చెయ్యకపోయినా బుద్ది తో పని చేస్తాము. ఈ లోపు కొత్తగా జరిగిన సంఘటన ని ఎదుర్కొనే శక్తి ని కూడగట్టుకోవడానికి ప్రయత్నం మొదలు పెడతాము. మా ఇంటిలో ఇద్దరు పెద్ద వాళ్ళు అనుకోని అనారోగ్యం పాలవడం జరిగింది - రెండు సార్లు. ఈ రెండు సార్లు కూడా నా మనసు కి కావాల్సిన శక్తి ని నేను ఈశ్వరుడిని ప్రార్ధించడం వల్లనే పొంద గలిగాను. రెండవ సారి - ఇటీవల ఇలాంటి పరిస్థితి నాకు చాలా ఇష్టమైన నెల్లూరు అత్తయ్య గారి విషయం లో వచ్చింది. ఈ సందర్భం గా నేను చేసిన నెల్లూరు ప్రయాణం జొన్నవాడ యాత్ర రూపం లో నాకు కొత్త శక్తి ని ఇచ్చింది.
సాయంత్రం నాలుగు గంటలకి నెల్లూరు నుంచి ఏడు ఎనిమిది మైళ్ళు ఉన్న జొన్న వాడ కి బయలు దేరాను. విడిగా వినడమే కాని అసలు నెల్లూరు దగ్గర ఊరు ఎలా ఉంటుందో, జొన్నవాడ క్షేత్రం ఎలాంటిదో నాకు ఏమి తెలియదు. ఆటో సాయంకాలపు నీరెండ లో పచ్చటి పొలాల పక్క గా వెళ్తూ ప్రతి నిముషం మనోహరం గా ఉంది. జీవశక్తి ని ప్రతి కణం లోను నింపుకున్న చక్కటి బియ్యం పండే మట్టి అది. ఆ మట్టి ని సస్య శ్యామలం చేసే నీటి ప్రవాహాలు అక్కడక్కడా. క్రమం గా చీకటి కమ్ముకుని వస్తోంది. నీలం గా ఉన్న ఆకాశం ఊదా రంగు పరదాలు వేసుకుంది. ఆకు పచ్చని పంట పొలాలు చిరు చీకట్ల రంగుతో కలిసి కొత్త రంగు లో వెలిగిపోతున్నాయి. కొద్ది సేపటికి దారి రెండు గా చీలిపోయింది. కుడి వైపు ఒక పాయ, ఎడమ వైపు ఒక పాయ. కుడి వైపు పాయ నేరుగా పెన్నా నది ని దాటుకుని సాగుతోంది. ఎడమ వైపు పాయ మలుపు తిరిగి ఇంకొక ఊరికి వెళ్తోంది. కుడి వైపు పెన్నా నది వంతెన దాటిన వెంటనే రోడ్ దిగువన జొన్నవాడ క్షేత్రం.
చాలా ప్రాచీనమైన క్షేత్రం. భగవంతుడు స్వయంభువు గా ఉన్న క్షేత్రం. గుడి లోకి అడుగు పెట్టిన తర్వాత ప్రతి అడుగు నాకు అద్భుతం గానే తోచింది. కొన్ని వందల సంవత్సరాల వైభవం ఈ నాటికి కూడా విశ్వాసం ఉన్న వందల మందిని తన వద్దకు తీసుకు వస్తున్నది. ఒక్కొక్క అడుగు కి ఒక్కొక్క పురాణ కథ. మల్లికార్జున స్వామి, కామాక్షి తాయి దర్శనం చాలా సంతృప్తి గా చేసుకున్నాను. కొత్త కొత్త రంగులు అద్ది ఉన్నా అతి ప్రాచీనమైన ఆధ్యాత్మిక వైభవం ఇంకా కనిపిస్తూనే ఉంది. అమ్మవారి ఎదురుగా మంటపం లో కూర్చుని ఉన్నాను. అప్పుడు చూసాను - ఆరోగ్య సమస్యలతో చిక్కి శల్యం అయిన అనేక మంది దీనులని. మతి స్థిమితం లేక ప్రపంచాన్ని పరాయి గా భావిస్తూ బ్రతుకుతున్న అమాయకులని. వారిలో చాలా మంది భయంకరమైన స్థితి లోనే ఉన్నారు. కాని అయిన వాళ్ళు వాళ్ళని గుడి మంటపం లో కూర్చోబెట్టి అమ్మవారి ప్రార్ధన చేయిస్తున్నారు. ఆ అమాయకులకి వారు ఎలాంటి ఆరోగ్య స్థితి లో ఉన్నారో తెలిసే స్పృహ లేకపోవచ్చు. కాని, వారి కళ్ళల్లో అచంచలమైన విశ్వాసం ఉంది. అమ్మవారి మీద, స్వామి వారి మీద అంతులేని ఇష్టం కనిపిస్తోంది. అది అభౌతికమో శాస్త్రీయమో - చాలా మంది విమర్శకులకి తెలియకపోవచ్చు. కాని నమ్మకాన్ని మించిన మందు ఈ భూమి మీద లేదు.
గుడి చుట్టూ ఉన్న ఉప ఆలయాలు అన్ని చూద్దామని చుట్టూ తిరిగాను. గుడి ప్రాంగణం నిండా శారీరక మానసిక స్వస్థత కోసం వచ్చిన వాళ్ళు రోజుల తరబడి ఉండేందుకు చేసుకున్న ఏర్పాట్లు. గుడి వెనక భాగం లో సాయంకాలపు సేవ లు జరుగుతున్నాయి. అక్కడ కూడా సామాన్య జనులతో పాటు ఆరోగ్యం సరిగా లేని చాలా మంది కూర్చుని ఉన్నారు. వైద్యం చేయించలేని వాళ్ళు, వైద్యానికి కూడా లొంగని జబ్బులని విశ్వాసం తో తగ్గించుకోవాలని వచ్చిన వాళ్ళు అనేకం గా ఉన్నారు - ఇంతకు మించిన మానవత్వాన్ని మనం ఎక్కడ చూడగలం ? ఇంతకు మించిన దీన జనోద్దారణ మరి ఎక్కడ గమనించగలం ? జొన్నవాడ క్షేత్రం మీద నాకు ఉన్న ఇష్టం ఆకాశాన్ని తాకింది. ఆ క్షేత్రం గురించి విన్నాను - "అక్కడ ఒక సమస్య తో వచ్చిన వాళ్ళు గుడి ప్రాంగణం లో నిద్ర చేస్తూ రోజులు గడుపుతూ ఉండగా, క్రమం గా పూర్ణ ఆరోగ్య వంతులు అవుతారు" అని. విశ్వాసం బలం గా ఉన్న వారికి అమ్మవారు కలలో కనిపించి "ఇక ఇంటికి వెళ్లి హాయిగా ఉండు" అని పంపిస్తారని. నాస్తికులు దీనిని అద్భుత రసం అని కొట్టివేయచ్చు. కాని, కంటి ముందు కనిపించే పరమ సత్యాలని ఎవరుకూడా విస్మరించలేరు.
మనసు నిండిన ఆనందం తో గుడి బయటకు వచ్చాను. ఆ రాత్రి సమయం లో ఆటో దొరకాలి అంటే పది నిముషాలు పెన్నా నది వంతెన దాటి నడవాల్సి వస్తుంది అన్నారు. అదే సమయం లో అక్కడ పని కోసం వచ్చిన ఒక కార్మికుడు నాతో పాటు నడుస్తూ నన్ను పలకరిస్తూ వంతెన దాటుతూ ఉన్నాడు. ఒక్క క్షణం ఆగి వంతెన మీద నుంచి పెన్నా నదిని, జొన్నవాడ గుడి ని చూశాను. ఆ పెన్నా నది నీళ్ళ లోనే మొదట అమ్మవారి విగ్రహం దొరికిందిట. అమ్మవారి గుడి దగ్గర పచ్చని దీపాల వెలుగులు - పున్నమి చంద్రుడి కాంతి లో నీలం గా మెరుస్తున్న పెన్నా నీటిలో ప్రతిఫలిస్తున్నాయి. అక్కడికి రహదారి రెండు గా చీలిన చోటు ఒక రెండు వందల మీటర్ల దూరం లో ఉంది. మేము ఆ జంక్షన్ వైపు నడుస్తున్నాం. కుడి వైపు మలుపు లో మేమున్నాం. ఎడమవైపు మలుపు లో ఒక కిలో మీటరు దూరం లో ఇంకొక పెద్ద కొండ ఉంది. ఆ కొండ మీద పెద్ద గుడి తెల్లని దీపపు కాంతులలో వెలిగిపోతోంది. అది వేదగిరి లక్ష్మి నరసింహ స్వామి గుడి అని చెప్పారు. తల్ప గిరి రంగ నాథ స్వామి (నెల్లూరు ఊరిలో పెన్నా ఒడ్డున ఉంది), రజత గిరి మల్లికార్జున స్వామి కామాక్షి అమ్మవారు (జొన్నవాడ), వేదగిరి లక్ష్మి నరసింహ స్వామి - మూడు చోట్ల స్వయం గా వ్యక్తం అయిన పుణ్య భూమి నెల్లూరు అని నాకు అర్థం అయ్యింది. ఈ ప్రదేశాలను తాకుతూ పచ్చని పొలాలని తడుపుతూ అక్కడి ప్రజలకి జీవాన్ని, జీవితాన్ని ఇస్తున్న సుర గంగ పెన్నమ్మ అని నాకు అనిపించింది. రజత గిరి, వేదగిరి దారులు కలిసిన ప్రదేశానికి వస్తు ఒక్క సారి వెనక్కి తిరిగి చూసాను.
ఎదురుగా సుసంపన్నమైన పొలాలు. కుడి వైపు చీలిన దారిలో పెన్నా నది, నది మీద వంతెన, నది ఒడ్డున దిగువ లో కామాక్షి అమ్మవారి గుడి. ఎడమ వైపు చీలిన దారిలో కొండ మీద వేదగిరి స్వామి వారి గుడి. ఇటు అమ్మ వారి గుడి బంగారు వెలుగులు పెన్నా లో తళుకులు అవుతున్నాయి. అటు వేదగిరి మీద నరసింహ స్వామి గుడి వెండి వెలుగులు ఆకాశాన్ని ధగ ధగ లతో నింపుతున్నాయి.
జొన్నవాడ అమ్మవారి విగ్రహం నా రెండు సంవత్సరాల కూతురు కూర్చుని ఉన్నప్పుడు ఎంత ఉంటుందో అలాగే ఉన్నట్టు అనిపించింది - అర గంట కింద చూసినప్పుడు. కాని ఇప్పుడు నా కంటికి ఆ గుడి మొత్తం అమ్మవారి లా కనిపిస్తోంది, ఆ పసుపు దీపాల వెలుగులు అమ్మవారి కుంకుమ, ఆభరణాల కాంతి లా అనిపిస్తోంది. పెన్నమ్మ అమ్మవారిని అభిషేకిస్తూ వెళ్తున్నట్టు గా ఉంది. పెన్నమ్మ లో మెరుస్తున్న అమ్మవారి గుడి దీపాల వెలుగులు, అభిషేకం చేస్తున్న నీటి మధ్యలో నుంచి మెరుస్తున్న అమ్మవారి గాజుల్లా ఉన్నాయి.
శ్రీలు పొంగిన జీవగడ్డయి పాలువారిన భాగ్య సీమయి
సాగినది ఈ భరత ఖండము భక్తి పాడర తమ్ముడా !

No comments:
Post a Comment